బోగస్ ఓట్లకు నిరసనగా తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద బీజేపీ-జనసేన శ్రేణుల బైఠాయింపు

  • తిరుపతి పార్లమెంటు స్థానం పోలింగ్ లో బోగస్ ఓట్ల కలకలం
  • ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించిన బీజేపీ, జనసేన నేతలు
  • ఎన్నికలు రద్దు చేయాలన్న బీజేపీ అభ్యర్థి రత్నప్రభ
  • మళ్లీ ఎన్నికలు జరపాలని పరిశీలకులకు విజ్ఞప్తి
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైసీపీ దొంగ ఓటర్లను బస్సుల్లో తరలిస్తోందని బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు తిరుపతిలో ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. అధికార వైసీపీ బోగస్ ఓటర్లతో పాల్పడుతున్న రిగ్గింగ్ రాజకీయాలకు చరమగీతం పాడాలని, జగన్ పాలనలో అంపశయ్యపై ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు నినాదాలు చేశారు.

తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ దొంగ ఓట్ల అంశంపై స్పందించారు. తిరుపతి నగరం ఎంతోమంది ఉన్నత విద్యావంతులకు నిలయం అని తెలిపారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిని కోరుకుంటున్నారని, అధికార మార్పును అభిలషిస్తున్నారని వివరించారు. అయితే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వందలాది బస్సుల్లో తరలించిన లక్షలాది మంది బోగస్ ఓటర్లతో కొనసాగుతున్న ఈ ఎన్నికలను రద్దు చేయాలని రత్నప్రభ డిమాండ్ చేశారు. మళ్లీ ఎన్నికలు జరపాలని ఎన్నికల పరిశీలకులను కోరారు.

BJP
Janasena
Protest
RDO Office
Bogus Votes

More Telugu News